యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాల్లో భాగంగా మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం పనుల పురోగతి, పారదర్శకతపై చర్చించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ రిసోర్స్ పర్సన్ బి. దాసు, ఇన్చార్జ్ ఏపీడీ ఎరకయ్య హాజరై సామాజిక తనిఖీ ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక తనిఖీ ద్వారా పనుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని, తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు ఎం.ఎల్.ఎన్. నాయుడు, అశోక్ కుమార్, పంచాయతీ రాజ్ ఏఈ, ఏపీఓ, ఈసీ, ఇతర సచివాలయ, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.