పెదవేగి మండలం విజయరాయి లో కోకో సిటీ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో భూసేకరణ
17/March/2026 11:40
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు
జిల్లాలో కోకో సిటీ ఏర్పాటుకు సంబందించి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పెదవేగి మండలం విజయరాయి లో కోకో సిటీ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో భూసేకరణ, తదితర అంశాలను సోమవారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో కోకో పంట అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఏలూరు జిల్లాలో కోకో సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుతున్నదన్నారు. ప్రతిష్టాత్మకమైన కోకో సిటీ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, తదితర పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందించి సమర్పించాలని, సదరు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. కోకో సిటీ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి అధికారులు అందించిన వివరాలను కలెక్టర్ పరిశీలించారు.వ్యవసాయశాఖాధికారి హబీబ్ భాషా, వడ్డీల కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత, ఎంఐపి ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.