అనకాపల్లి:
అనకాపల్లి పట్టణంలో బుద్ధ భగవానుని 2539వ జయంతి వేడుకలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అనకాపల్లి శాఖ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ, "బుద్ధం శరణం గచ్చామి" అన్న నినాదం ప్రపంచవ్యాప్తంగా శాంతికి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు. ఎన్ని యుగాలు గడిచినా, ఈ భూమి ఉన్నంత వరకు బుద్ధుని బోధనలు అజరామరమని, ఆయన చూపిన మార్గం ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ముఖ్యంగా నేటి సమాజంలో ప్రతి అధికారి, పౌరుడు బుద్ధుని అడుగుజాడల్లో నడిచినప్పుడే మన దేశం ప్రపంచ దేశాల కంటే మిన్నగా కీర్తి ప్రతిష్టలు గడిస్తుందని వారు ఆకాంక్షించారు. భావితరాలకు బుద్ధుని గొప్పతనాన్ని చాటిచెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు బుద్ధుని జీవిత విశేషాలను, బోధనలను పాఠ్యాంశాలుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే భారతదేశం నిజమైన శాంతి దేశంగా విరాజిల్లుతుందని వారు అభిప్రాయపడ్డారు.
"బుద్ధుని అడుగుజాడల్లో నడుద్దాం - శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం" అనే పిలుపుతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ వేడుకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.