ఎస్ జి ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మహిళా రిజర్వేషన్ బిల్పై అవగాహన సదస్సు.!
14/April/2026 15:20
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి: యలమంచిలి స్థానిక ఎస్ జి ఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు మహిళా రిజర్వేషన్ బిల్ 2023 పై “స్త్రీ శక్తి” పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఏ. సత్యనారాయణ, ఐక్యుఏసి కోఆర్డినేటర్ వెంకన్న, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ అర్జున అప్పారావు, డాక్టర్ చిట్టిబాబు, గోవింద్ వక్తలుగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వక్తలు మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఆమోదించి చట్టంగా తీసుకురావాలని సూచించారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు చట్టసభల్లో కేవలం 13-14 శాతం మాత్రమే ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. గృహ నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించే మహిళలకు చట్టసభల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వం, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించి విజేతలకు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కార్యదర్శి డాక్టర్ సుజాత, సభ్యులు డాక్టర్ విజయభారతి, శ్రీమతి దేవి తదితరులు పాల్గొన్నారు.