సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెంచాలి-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, ఏప్రిల్,ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను
www.elururythusampada.in వెబ్సైటు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఈ వెబ్సైట్ ద్వారా ఏలూరు జిల్లా రైతులు సహజ విధానాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఒక వేదికగా పనిచేస్తుందన్నారు. జిల్లాలో సహజ వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని, అందరూ ఈ వేదికను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. ముందుగా జిల్లాలోని అధికారులందరూ
elururythusampada.in వెబ్సైట్ను తప్పనిసరిగా సందర్శించి, అందులో లభ్యమయ్యే సహజ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సహజ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎస్.కె. హబీబ్ బాషా, జిల్లా ఉద్యానవన అధికారి, పీడీ డీఆర్డీఏ, పీడీ ఏపీఎంఐపీ, పీడీ మెప్మా తదితర అధికారులు పాల్గొన్నారు.