అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారికి పోటెత్తిన ఆదాయం: నెల రోజుల్లో రూ. 80 లక్షలకు పైగా కానుకలు..
13/April/2026 07:18
Share:
అనకాపల్లి : క్రైమ్ అనాలసిస్ , ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారికి భక్తుల నుంచి కానుకలు వెల్లువలా వచ్చి చేరాయి. అమ్మవారి నూతన ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ విశేషంగా పెరుగుతుండటంతో హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో నమోదైంది. శనివారం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయ హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన కానుకలను పకడ్బందీగా లెక్కించారు.గత నెల 11వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు (నెల రోజుల వ్యవధిలో) భక్తులు సమర్పించిన కానుకల వివరాలను దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఎన్. సుజాత అధికారికంగా వెల్లడించారు. ఈ లెక్కింపులో నగదు రూపంలో రూ. 80,17,580 (ఎనభై లక్షల పదిహేడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు) ఆదాయం లభించినట్లు ఆమె తెలిపారు. నగదుతో పాటు, భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించిన 9 గ్రాముల 100 మిల్లీ గ్రాముల బంగారం, మరియు 710 గ్రాముల వెండి ఆభరణాలు కూడా హుండీ ద్వారా లభ్యమయ్యాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉప కమిషనర్ ఎన్. సుజాత మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతోందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. క్యూలైన్ల నిర్వహణ, త్రాగునీరు తదితర సదుపాయాల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు.ఈ భారీ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్. సుధారాణి, నూకాంబిక అమ్మవారి ఆలయ సహాయ కమిషనర్ యాల్ల శ్రీధర్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పీలా నాగశ్రీను, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంతరావు, అలాగే ఇతర ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు. ఎ శ్రీనివాస్ రావు.క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.