వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి విజ్ఞప్తి.
08/April/2026 06:45
Share:
అనకాపల్లి, ఏప్రిల్ 07: పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు మరియు చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు కోరారు. సెలవుల్లో సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడటం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు పలు కీలక సూచనలు జారీ చేశారు పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి లేదా స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, సముద్ర తీరం మరియు నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. నీటి లోతు తెలియక, ప్రవాహ వేగానికి లోనై ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా అటువైపు వెళ్లనివ్వకూడదు.పిల్లలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్త పడాలి. నీటి ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు వివరించి వారిలో అవగాహన పెంపొందించాలి. సరదా ప్రాణాంతకం కాకూడదని వారికి తెలియజేయాలి.సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం లేదా వేసవి శిక్షణ శిబిరాల వైపు మళ్లించడం ద్వారా వారి సమయాన్ని సురక్షితంగా మరియు ఉపయోగకరంగా మార్చవచ్చు.జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు అలల ఉధృతిని గమనించాలి. హెచ్చరిక బోర్డులు ఉన్న చోట నీటిలోకి దిగడం ప్రాణాంతకమని గుర్తించాలి."పిల్లల భవిష్యత్తు మరియు వారి భద్రత తల్లిదండ్రుల బాధ్యత. వేసవి సెలవుల్లో ఏ ఒక్క కుటుంబంలోనూ విషాదం చోటుచేసుకోకూడదన్నదే మా ఉద్దేశ్యం.జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది, ప్రజలు కూడా సహకరించాలి" అని ఎస్పీ గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవిస్తే వెంటనే డయిల్ 100/112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరడమైనది.