ఏలూరు 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ.14. 07 కోట్లతో జిల్లాపరిషత్ బడ్జెట్ ఆమోదం
22/March/2026 20:33
Share:
రానున్న వేసవిలో జిల్లాలోగా ఎక్కడా త్రాగునీటి కొరత లేకుండా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి -జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ.14. 07 కోట్లతో జిల్లాపరిషత్ బడ్జెట్ ఆమోదం జెడ్పి చైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం ఏలూరు, మార్చి , 22 : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రానున్న వేసవిలో త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రజాపరిషత్ సమావేశపుహాలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి జెడ్పి చైర్ పర్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 557 ఉండగా, వాటిలో 194 ట్యాంకులలో 75 నుండి 95 శాతం వరకు, 280 చెరువులలో 70 నుండి 50 శాతం వరకు నీటిని నింపడం జరిగిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రానున్న వేసవిలో త్రాగునీటిఎద్దటి రాకుండా సంబంధిత శాఖల అధికారులందరూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలనీ, ప్రజల త్రాగునీటి అవసరాలకు తగినవిధంగా మంచినీటి చెరువులన్నింటిని పూర్తిస్థాయిలో నింపుకోవాలన్నారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేసే లోగా మంచినీటి చెరువులను నింపుకునేలా పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల అడ్డంకిగా ఉన్న తూడు గుర్రపుడెక్కను తొలగించి, శివారు ప్రాంతాలకు సైతం నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిలాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీగా డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలని, జిల్లాలో ప్రజలకు అసౌకర్యం ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. జిల్లాలో నిర్మాణం పూర్తి ఐన రైతు సేవా కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాలు వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో గృహ వినియోగదారులకు వంట సరఫరాకు ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పఠింహాలని అధికారులను ఆదేశించారు. శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం ప్రగడపల్లిలో రైతు సేవా కేంద్రం, సామజిక ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మాణం పూర్తి అయినప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించని కారణంగా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రైతు సేవా కేంద్రం, సామజిక ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మాణం పూర్తి అయినప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించని కారణంగా వినియోగంలోకి రాలేదని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు, పెడీట్రిషియన్ వైద్యుల పోస్ట్లు ఖాళీగా ఉండడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సదరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో అధిక శాతం అబార్షన్లు జరిగాయని వార్తలు వచ్చాయని, వీటిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరతా లేదన్నారు. జిల్లాలో పైపు లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా కొన్నిసీట్లు 5 వేల వరకు ఉన్నాయని, వాటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం, సంక్షేమ వసతి గృహాలకు కూడా ఎటువంటి కొరతా లేకుండా వంట గ్యాస్ ను సరఫరా చేస్తున్నామన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా 10 నుండి 20 శాతం మేర అదనంగా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు జేసీ తెలియజేసారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిక నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల నుండి గ్రంధాలయ సెస్సు గా 9 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వాటిని గ్రందాయాలయ సంస్థకు జమచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆచంట జెడ్పిటిసి మాట్లాడుతూ అతి తీవ్రమైన వ్యాధి ఎస్ఎంఏ ని ముందుగానే గుర్తించేందుకు బిడ్డ పుట్టిన రెండునెలలలోగా వైద్య పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరు కోరాలని విజ్ఞప్తి చేశారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ.14. 07 కోట్లతో జిల్లాపరిషత్ బడ్జెట్ ఆమోదం-జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ 2026-27 ఆర్ధిక సంవత్సరానికి 14 కోట్ల 7 లక్షల 80 వేల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను సమావేశం ఆమోదించింది. అదే విధంగా 2025-26 ఆర్ధిక సంవత్సరానికిగాను 12 కోట్ల 23 లక్షల 80 వేల కోట్ల రూపాయలతో సవరించిన బడ్జెట్ ను సమావేశం ఆమోదించింది. సమావేశంలో జిల్లాపరిషత్ ఇంచార్జ్ సీఈఓ భీమేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా రెవిన్యూ అధికారి నారాయణరెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పిటిసి లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.