కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాత కార్మిక చట్టాలను మార్చి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాస్ ఆరోపించారు. ఏఐటీయూసీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక పీవీ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ మరియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల జీవో ప్రతులను కార్మికులు దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గనిశెట్టి ఏసుదాస్ మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి 12 గంటల పని విధానంగా తీసుకురావడం, రాత్రి వేళల్లో మహిళలతో కూడా పనులు చేయించేలా కొత్త నిబంధనలు తీసుకురావడం సరైంది కాదన్నారు. అలాగే కార్మికుల హక్కుల కోసం పోరాడే క్రమంలో నిర్బంధాలు, ఆటంకాలు కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం ఆందోళనకరమని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వై. నూకరాజు, సీహెచ్. వెంకటరమణ, డి. మహేష్, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.