అనకాపల్లి:
రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన అనకాపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో చోటుచేసుకుంది.
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చోడవరం ప్రాంతానికి చెందిన బుద్ధగిరి మాణిక్యం అనే మహిళ మునగపాక కాజీపాలెం వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో పాయకరావుపేట నుండి అనకాపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు (నెంబర్: AP 31 Z 0202) ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మాణిక్యం ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో అనకాపల్లి ట్రాఫిక్ ఎస్ఐ డి. శేఖరం తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, వివరాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలను సేకరించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆమె కుమారుడు శ్రీనివాస్కు అప్పగించారు. తల్లి అకాల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.