సైబర్ వలల పట్ల అప్రమత్తత అవసరం:(ఆన్‌లైన్ మోసాలు)

సైబర్ వలల పట్ల అప్రమత్తత అవసరం:(ఆన్‌లైన్ మోసాలు)

23/May/2026 08:07    Share:   

లాలాంచెరువు,ఎలమంచిలి: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమను తాము రక్షించుకోగలరని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక ఎలమంచిలి టౌన్ లోని ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల సంరక్షణ చట్టాలు, సైబర్ నేరాలపై మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. దిశ చట్టం, గృహహింస నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీసులు ఏ విధంగా అండగా ఉంటారో వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ఫ్రాడ్స్ (ఆన్‌లైన్ మోసాలు) పట్ల మహిళలు, యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. లక్కీ డ్రాలు, తక్కువ ధరకే వస్తువులు, తక్కువ వడ్డీకే రుణాలు అంటూ వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయవద్దని కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే '1930' హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా ట్రైనీలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter