రూ.15 లక్షల ఆస్తి నష్టం.!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న సింహాద్రి బ్రోస్ ఈట్ రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సీఐ రాంబాబు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.
అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాయకరావుపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, అక్కడి నుంచి మరో ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుంది. రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది సమన్వయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో రెస్టారెంట్ యజమాని సేనాపతి లక్ష్మికి సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే తమను ఆదుకుని తగిన సహాయం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఎలమంచిలి పట్టణ ఎస్సై సావిత్రి, ఏఎస్ఐ చల్లారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సీఐ రాంబాబు మాట్లాడుతూ, ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. అగ్నిమాపక భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచి, వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ఆస్తి నష్టం, ప్రాణనష్టం వంటి ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు