ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి: సిఐటియు డిమాండ్

ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి: సిఐటియు డిమాండ్

14/July/2026 17:49    Share:   

అనకాపల్లి:
రాష్ట్రంలోని షాపులు, పరిశ్రమల వద్ద పనిచేస్తున్న ముఠా కార్మికుల రక్షణ కోసం తక్షణమే సమగ్ర చట్టం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 16న విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. అనకాపల్లిలోని దొడ్డి రామనాయుడు భవనంలో జరిగిన సమావేశంలో ఆర్. శంకరరావు ముఖ్య ప్రసంగం చేశారు. ముఠా కార్మికులు తమ శ్రమనే నమ్ముకుని జీవిస్తున్నారని, నిత్యం అధిక బరువులు మోయడం వల్ల తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన చట్టపరమైన రక్షణ లేకపోవడంతో, వయసు పైబడిన తర్వాత వారిని ఆదుకునే దిక్కు లేకుండా పోతోందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ముఠా కార్మికులకు సమగ్ర చట్టం తెస్తామని హామీ ఇచ్చిందని, అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి అడుగు ముందుకు పడలేదని ఆయన విమర్శించారు. ముఠా కార్మికుల సంక్షేమం కోసం పెన్షన్, పీఎఫ్ (PF), ఈఎస్‌ఐ (ESI) వంటి సౌకర్యాలతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాల సాధనకై విశాఖలో జరిగే రాష్ట్ర సదస్సును కార్మికులందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం జిల్లా గౌరవాధ్యక్షుడు ఆర్. రాము, జిల్లా కార్యదర్శి కే. అప్పలరాజు, కమిటీ సభ్యులు మజ్జి శంకర్రావు, ఆర్. అప్పలనాయుడు, నాగ అప్పారావు, నాగు నాయుడు, సంతోష్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

 
Breaking News

Subscribe our Newsletter