అనకాపల్లి తుమ్మపాల రోడ్లు అస్తవ్యస్తం – చెరువులను తలపిస్తున్న రహదారులు, వాహనదారుల అవస్థలు అనకాపల్లి మండలంలోని తుమ్మపాల ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. మాటూర్ జంక్షన్ నుంచి తుమ్మపాల ఏలేరు కాలువ వరకు ఉన్న రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ గుంతల్లో నీరు చేరిపోవడంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుండగా, రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీటిలో గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సమస్యపై రోడ్లు & భవనాల శాఖ (R&B), పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ, అనకాపల్లి మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వర్షపు నీరు నిల్వ కాకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకొని రహదారులను మరమ్మతు చేసి, వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. క్రైమ్ ఎనాలిసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్