ఖరీఫ్ సీజన్కు రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు..!!ఏపీ ఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకుంటేనే ఎరువులు..! క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ : రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులందరూ ఏపీ ఏఐఎంఎస్ (AP AIMS) యాప్ను డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎం. ఆశాదేవి సూచించారు.ఎలమంచిలి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మండలంలోని 8,450 మంది రైతులు యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతుందని తెలిపారు. రైతుల పంటల నమోదు, భూవిస్తీర్ణం, పంటల సరళి ఆధారంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు యూరియా, డీఏపీ తదితర ఎరువులు మూడు దఫాలుగా అందజేయనున్నట్లు వెల్లడించారు.ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ విధానం రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.రైతులు రైతు సేవా కేంద్రాలు (RSKలు), ప్రాథమిక సహకార సంఘాలు (PACS), ప్రైవేట్ ఇన్పుట్ డీలర్ల వద్ద ఎరువులు పొందాలంటే ముందుగా ఏపీ ఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. రైతులు తమ స్మార్ట్ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా రైతులకు కంప్యూటర్ ద్వారా యాప్ వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మోహన్రావు, వ్యవసాయ సహాయకులు లోకేష్, అరుణ, రైతులు ఆడారి రమణబాబు, ఆడారి రమణ, తోట గణేష్ తదితరులు పాల్గొన్నారు.