ఏలూరు రానున్న 5 రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
15/June/2026 21:03
Share:
ఏలూరు జిల్లాలోని అన్ని మండలాలలో రానున్న 5 రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. ఈనెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు జిలాల్లోని అన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 నుండి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంటుందని, తీవ్రమైన ఎండలు... వేడిగాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రద్దీ ప్రదేశాలలో మంచినీటి సౌకర్యం, శీతలీకరణ షెల్టర్లు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేడిగాలులకు గురైన వారికి సత్వరమే చికిత్స అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది సంబంధిత ఔషధాలను సిద్ధం చేసుకోవాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.