భవన నిర్మాణ సమస్యలపై కార్మిక శాఖ కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా..
15/June/2026 18:21
Share:
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అన్ని యధాతధంగా అమలు చేయాలని ఎలమంచిలి కార్మిక సహాయ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి మినపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, భావన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చందక రామకృష్ణ మాట్లాడుతూ, 2020 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి నిలిపివేసిన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి 1వ తేదీ నుంచి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కేవలం నాలుగు పథకాలు మాత్రమే అమలులోకి తీసుకువచ్చిందని తెలిపారు.అలాగే వివాహ కానుక, ప్రసవ కానుక, మృతి పరిహారం వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ నిధిలో వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, వాటిని కార్మికుల సంక్షేమానికి వినియోగించడం లేదని విమర్శించారు.యూనియన్ ప్రతినిధులు ప్రధానంగా 2020 సెప్టెంబర్ 7వ తేదీకి ముందు రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించడం, 2020 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 2026 మార్చి 1వ తేదీ వరకు ప్రమాదాలు, మరణాలు తదితర కారణాలతో నష్టపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడం, పెళ్లి, ప్రసవ, సహజ మరణ పరిహార పథకాలను తిరిగి అమలు చేయడం, నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని కార్మికుల సంక్షేమానికే వినియోగించడం వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ మణికంఠ భాను నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రాజాన అప్పలనాయుడు, శ్రీ శ్రీ ఉమా సహిత సోమేశ్వర స్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కే రమేష్ ,నిర్మాణ కార్మికులు పట్టం నూకరాజు, గురి వసంత తదితరులు పాల్గొన్నారు.