క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
అచ్చుతాపురం,
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన అన్ని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిమ్మరాజుపేట, కొండకర్ల, దోసూరు, అచ్చుతాపురం గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఆర్. రాము, కె. సోమునాయుడు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేశారని తెలిపారు. ప్రస్తుతం సంక్షేమ బోర్డు పునరుద్ధరించినప్పటికీ, కార్మికులకు అందాల్సిన 11 రకాల సంక్షేమ పథకాలలో కేవలం వివాహ కానుక, ప్రసూతి సహాయం, సహజ మరణ సహాయం, అంత్యక్రియల ఖర్చుల సహాయం వంటి నాలుగు పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు.
గతంలో ప్రమాదవశాత్తు గాయపడిన లేదా మరణించిన కార్మికులకు నష్టపరిహారం అందించేవారని, ప్రస్తుతం ఆ పథకాలను నిలిపివేయడం అన్యాయమని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని, ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు కార్డులు జారీ చేసి పాత కార్డులను రెన్యువల్ చేయాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, అయితే కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను విరమించి ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజన్న అప్పలనాయుడు, పి. రాజు, రమేష్, ఆర్. చిట్టిబాబు, వసంత, పైడిరాజు, హరి, కె. రాజు చిన్న తదితరులు పాల్గొన్నారు.