మాజీ శాసనమండలి సభ్యులు సంకు అప్పారావు 35వ వర్ధంతి,నివాళులర్పించిన సిపిఐ
29/May/2026 21:36
Share:
సమరయోధులు,నిరంతర స్ఫూర్తి ప్రదాతలు, సంకు అప్పారావు కనకం సోం బసవరాజు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసనమండలి సభ్యులు సంకు అప్పారావు 35వ వర్ధంతి, స్వాతంత్ర్య సమరయోధులు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కనకం సోం బసవరాజు 25వ వర్ధంతి కార్యక్రమం ఆర్.ఆర్.పేట కనకం వారి వీధి,సంకు అప్పారావు విగ్రహం వద్ద ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన జరిగినది.సంకు అప్పారావు విగ్రహానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కనకం సోం బసవరాజు చిత్రపటానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ సంకు అప్పారావు,జోహార్ కనకం సోం బసవరాజు, అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేయడంలో వంక సత్యనారాయణ, కపర్తి వంటి అగ్రగణ్యులతో కలిసి సంకు అప్పారావు ప్రధాన భూమిక పోషించారని కొనియాడారు. సంకు అప్పారావు రైతు సంఘం నాయకునిగా రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యల పరిష్కారం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నిర్మాణ బాధ్యునిగా పనిచేసి అక్కడ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన కనకం సోం బసవరాజు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలను నిర్వహించారని తెలిపారు. వారు మన ముందు వదిలిన ఆశయాలను సాధించడమే వారికి అందించే ఘనమైన నివాళి అని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు సంకు అప్పారావు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి విస్తరణకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. 1937లో పార్టీ సభ్యత్వం స్వీకరించి, జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం సంకు అప్పారావు అలుపెరుగని పోరాటాలు చేశారని తెలిపారు. కాళీపట్నం జమీందారీ వ్యతిరేక పోరాటం గోపాలపురం జమీందారీ వ్యతిరేక పోరాటం, పెండ్యాల, కానూరు లంక భూముల పోరాటం వంటి రాష్ట్ర వ్యాప్త రైతాంగ సమస్యలపై చేసిన పోరాటాలు సంకు అప్పారావుపై, కమ్యూనిస్టు పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయని తెలిపారు.1937లో డాక్టర్ కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తి, చలసాని వాసుదేవరావు నాయకత్వంలో తడ నుండి ఇచ్చాపురం వరకు జరిగిన రైతు రక్షణ యాత్రను ఈ జిల్లాలో జయప్రదం చేయడానికి కామ్రేడ్ సంకు అప్పారావు వందలాది గ్రామాలు సందర్శించి, రైతులను సమీకరించి యాత్ర జయప్రదానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. కనకం సోం బసవరాజు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు అనేక పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారని కొనియాడారు. వీరిరువురి పోరాటాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు సంకు అప్పారావు,కనకం సోం బసవరాజు వంటి ఆ తరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు చేసిన పోరాటాలను, ఉద్యమాలను మననం చేసుకుంటూ నేడు ప్రతి ఒక్క కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏలూరు ఏరియా సమితి కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కనకం జగన్మోహన్రావు, ఎర్ర వెంకటేశ్వరరావు, గేదెల నాగేశ్వరరావు, బి.శ్రీదేవి,మోరు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.