విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
13/February/2026 07:32
Share:
విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష – అనకాపల్లి జిల్లా పోలీసుల కృషిని అభినందించిన ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్. సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద. విశాఖపట్నం (చోడవరం), ఫిబ్రవరి 12: సమాజంలో గురువుగా ఉండి విద్యార్థిని పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక ఉపాధ్యాయుడికి విశాఖపట్నం పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 2015లో చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ సంచలనాత్మక కేసులో నిందితుడు కొయ్యన తిరుపతిరావు (ఫిజిక్స్ టీచర్) కు నేరం నిరూపితం కావడంతో కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు వెలువరించిన తీర్పు వివరాలు: కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవనీయ పోక్సో కోర్టు, నిందితుడికి ఈ క్రింది విధంగా శిక్షలు ఖరారు చేసింది: ప్రధాన శిక్ష: నిందితుడు తిరుపతిరావుకు ఏక కాలంలో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జరిమానా: నిందితుడికి రూ.71,000/- జరిమానా విధించింది. ఒకవేళ ఈ జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా ఏక కాలంలో ఏడు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలికి ఊరట: బాధితురాలికి జరిగిన అన్యాయానికి పరిహారంగా రూ.70,000/- చెల్లించాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది. కేసు నేపథ్యం: 2015లో చోడవరంలోని చలపతి స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేసిన తిరుపతిరావు, 8వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని మాయమాటలతో ప్రలోభపెట్టి అపహరించాడు. రాజస్థాన్కు తరలించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకుని చార్జ్షీట్ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ గారి అభినందనలు: ఈ సంచలన తీర్పు వెలువడటం పట్ల అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన: అప్పటి చోడవరం, ఎస్సై బి.రమణయ్య, ఎస్.ఇలియలాస్ అహమ్మద్ (చోడవరం ఇన్స్పెక్టర్),బి.సునీల్ (అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ)(దర్యాప్తు అధికారి)బట్టి రాజశేఖర్ (స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) లను ఎస్పీ గారు ప్రశంసించారు. మహిళలు మరియు బాలికల భద్రత విషయంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని ఎస్పీ గారు పేర్కొన్నారు.