
అనకాపల్లి, మార్చి 20, 2026: అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు ఈ క్రింది విధంగా వెల్లడించారు.
తేదీ 18.03.2026న కొత్త అమావాస్య సందర్భంగా ఒక కుటుంబం అనకాపల్లి మండలంలోని తమ బంధువుల గ్రామానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం సుమారు 7:00 గంటల సమయంలో బాధిత బాలిక తన సోదరీమణులతో కలిసి చిన్నమ్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా, సీతిని రాజు అనే వ్యక్తి బాలికను ప్రలోభపెట్టాడు. మేడ మీదకు వస్తే స్టేజ్ ప్రోగ్రామ్ చూపిస్తానని నమ్మించి, డాబా మెట్ల వద్దకు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతానని బెదిరించాడు.భయపడి కిందకు వచ్చిన బాలిక తన తల్లికి జరిగిన విషయాన్ని వివరించగా, వారు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు మేడపై నుండి దూకి పరారయ్యాడు.
పోలీసుల వేగవంతమైన చర్యలు: బాధితురాలి ఫిర్యాదు మేరకు తేదీ 18.03.2026 రాత్రి 23:50 గంటలకు అనకాపల్లి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ G. రవి కుమార్ గారు కేసు నమోదు చేశారు (Cr. No. 52/2026 U/s 65(2) BNS & Sec. 5 (m) r/w 6 of POCSO Act, 2012).
అనకాపల్లి SDPO శ్రీమతి M. శ్రావణి గారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో భాగంగా గాలింపు చర్యలు చేపట్టి, నిందితుడు తప్పించుకోకుండా పక్కా ప్లాన్తో వెతికి, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అంటే తేదీ 19.03.2026 సాయంత్రం మార్టూరు పంచాయితీ గుంకలలోవ గ్రామ శివారులో నిందితుడు సీతిని రాజును అరెస్ట్ చేశారు. బాధితురాలిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నేరం జరిగిన అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా పోలీస్ యంత్రాంగం అభినందించింది.