అమరావతి: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLAs) నియామక పత్రాలను (Form ID: BLA-2) నియోజకవర్గ స్థాయి ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) వెంటనే స్వీకరించాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లెళ్ళ అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (CEO) లేఖ రాశారు.
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున సమర్పించిన బీఎల్ఏ నియామక ఫారాలను స్వీకరించేందుకు ఈఆర్వోలు నిరాకరిస్తున్నారని, దీనివల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్య హక్కుల భంగం: రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోవడం చట్టబద్ధమైన హక్కు అని, ఈ ప్రక్రియలో అధికారులు సహకరించకపోవడం వల్ల పారదర్శకత లోపిస్తుందని మరియు పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు.వెంటనే ఆదేశాలు జారీ చేయాలి: ఎటువంటి ఆలస్యం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో Form ID: BLA-2 లను స్వీకరించేలా జిల్లా కలెక్టర్లు మరియు ఈఆర్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన సీఈఓను కోరారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు రాజకీయ పార్టీల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అధికారులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ తన లేఖలో డిమాండ్ చేసింది.