ఏలూరులో ఘనంగా 140 వ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు..

ఏలూరులో ఘనంగా 140 వ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు..

01/May/2026 20:01    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,

అంతర్జాతీయ 140 వ శ్రామిక దినోత్సవాన్ని ఏలూరులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు ఐఎఫ్టియు కార్యాలయం, వన్‌టౌన్ మార్కెట్ సెంటర్, మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ వద్ద హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, "కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, వారి శ్రమకు తగిన గుర్తింపు రావాలని" ఆకాంక్షించారు. "కార్మికుల శ్రమకు విలువ పెట్టాలి. శ్రమశక్తే అభివృద్ధికి పునాది" అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక హక్కులకు ఎదురవుతున్న ప్రమాదాలను ఆయన ఎత్తి చూపారు. "వేతనాలు, బోనస్లు, పెన్షన్లు కోతకు గురవుతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచుతూ కార్మిక హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారు" అని చెప్పారు. ముఖ్యంగా సమ్మె హక్కుపైనా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "మేం కూడా మనుషులమే. మా శక్తికి పరిమితులు ఉన్నాయి. రోజు పొడవునా దోచుకున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికులు చేసిన పోరాటం మానవ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది" అని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు వికాసానికి సాధించుకోవడం కార్మిక పోరాటానికి ప్రతీక అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు, పెద్ద సంఖ్యలో హమాలీ వర్కర్లు పాల్గొన్నారు. "కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి... మేడే వర్థిల్లాలి..." అంటూ శ్రామిక సంఘ నాయకులు నినదించారు.
Breaking News

Subscribe our Newsletter