విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ లో భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా ఓ భక్తురాలు అమ్మవారికి విలువైన బంగారు నెక్లెస్ను బహూకరించారు. ఎన్ఏడి ప్రాంతానికి చెందిన భక్తురాలు వి. పరదేశమ్మ తాను కోరుకున్న మనోరథాలు నెరవేరడంతో తన మొక్కును చెల్లించుకున్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో శోభారాణి, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజుకు సుమారు రూ.3.80 లక్షల విలువైన రెండు తులాల బంగారు నెక్లెస్ను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించడం పవిత్ర సంప్రదాయంగా భావిస్తారని తెలిపారు. ముఖ్యంగా మార్గశిర మాస ఉత్సవాలు, శుక్రవారాలు, ప్రత్యేక పండుగల సందర్భంగా ఇటువంటి కానుకలు సమర్పించడం విశేషమని పేర్కొన్నారు. భక్తురాలు పరదేశమ్మ కుటుంబంపై అమ్మవారి కరుణ ఎల్లప్పుడూ ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆలయ అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు రాజేంద్ర కుమార్, ఆనంద్ కుమార్, పర్యవేక్షకులు కనకరాజు, పద్మజ తదితరులు పాల్గొన్నారు.