ప్రాణాల రక్షణకు హెల్మెట్ తప్పనిసరి కుటుంబానికి అండగా ఉండాలంటే నిబంధనలు పాటించండి..!
29/April/2026 07:32
Share:
కుటుంబానికి అండగా ఉండాలంటే నిబంధనలు పాటించండి..! ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ..!! క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ - యలమంచిలి : యలమంచిలి, మంగళవారం: పట్టణ శివారు కొత్తపాలెం జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వాహనదారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. “హెల్మెట్ జరిమానా తప్పించుకోవడానికి కాదు… ప్రాణాలను కాపాడుకోవడానికి” అని ఆయన పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కావడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కుటుంబ సభ్యుల కోసం అయినా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని హెచ్చరిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు పోలీసులకు సహకరించి రహదారి భద్రతకు తోడ్పడాలని ఎస్సై రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.