పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. శ్రీనివాస్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలి..ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు డిమాండ్.. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, ఏప్రిల్ మంగళగిరిలో నిర్వహించిన బీసీవై పార్టీ నిరసన దీక్షలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వేదికలపై మాట్లాడే నాయకులు, తమ పదజాలంపై నియంత్రణ పాటించడం అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో విస్తృత ఆదరణ పొందిన నాయకులపై, అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని విమర్శించారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలు అందరు భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో నిష్కళంకత, పారదర్శకత కోసం కృషి చేస్తున్న నాయకుడని అలాంటి నాయకుడిపై ఆధార రహిత ఆరోపణ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ అవి పరిమితులు దాటకూడదని, వ్యక్తిగత దూషణలకు తావు ఇవ్వకూడదని అప్పల నాయుడు సూచించారు. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య అనవసర ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని, రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అప్పలనాయుడు అన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజార్చడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ యాదవ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని జనసేన పార్టీ కార్యకర్తలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చేపట్టేందుకు జనసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం, విలువలు కాపాడటం అందరి బాధ్యత అని, అలాంటి విలువలను దెబ్బతీసే చర్యలను సమాజం సహించదని ఆయన తెలిపారు..