అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు హైకోర్టు ఊరట
16/April/2026 19:54
Share:
టిడిఆర్ బాండ్లు కాదు… నగదు పరిహారం తప్పనిసరి – కాంక్రీట్ గోడల నిర్మాణం నిలిపివేయాలి. క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు హైకోర్టు కీలక ఊరట కల్పించింది. టిడిఆర్ (TDR) బాండ్ల రూపంలో కాకుండా, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినట్లు వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు.మునగపాక మండలం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోడ్డు విస్తరణ వల్ల సుమారు 2000 ఎకరాల పంట భూములు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా మునగపాక, గంగాదేవిపేట, ఒంపోలు గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గంగాదేవిపేట జంక్షన్ నుంచి మునగపాక జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములు వరద ముప్పుకు గురయ్యే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రైతులు స్వచ్ఛందంగా కాలువలను మరమ్మతు చేసి, నీటిని కృష్ణంరాజు కాలువకు మళ్లిస్తూ పంటలను రక్షించుకుంటున్నారని చెప్పారు.అయితే భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకముందే, ఎటువంటి పరిహారం చెల్లించకుండా రోడ్డుకు ఇరువైపులా కాంక్రీట్ గోడల నిర్మాణం చేపడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ గోడలు నిర్మిస్తే వరద సమయంలో నీరు నిలిచిపడి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కావున వెంటనే ఆ నిర్మాణాలను నిలిపివేసి, ముందుగా రైతులకు చట్టబద్ధంగా నగదు పరిహారం చెల్లించి భూ సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతుందని, పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు పెంటకోట సోమ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చియ్య నాయుడు, మూల సంఘం నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు మరియు బాధిత రైతులు పాల్గొన్నారు.