క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి : యలమంచిలి రామ్నగర్లోని రామాలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామ్నగర్ మాజీ కౌన్సిలర్ పడాల శ్రీను, కావ్య వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం సీతారాముల వారి కళ్యాణం జరిపించారు. కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమంలో కోటారు శ్రీనివాస్ మాస్టర్, లంక ఉదయ్, దవులూరు పెంటయ్య, ప్రగడ నరసింహారావు, పడాల బాబురావు, శీరందాసు చిన్న, పడాల రమణ, పడాల రాజు, పడాల రాములు తాత, పడాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం సీతారాముల విగ్రహాలను భజనలు, చిడతలు నడుమ వీధుల్లో ఊరేగింపుగా తిప్పుతూ కోలాహలంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిరసంలో మునిగిపోయారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బుర్రకథ, భజనలు వంటి సాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై ఆస్వాదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలు సమాజానికి మార్గదర్శకాలని తెలిపారు. సమాజంలో ప్రేమ, సహనం, సహకార భావనలు పెంపొందించాలని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని సూచించారు. రామ్నగర్ ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఇంటా శుభసమృద్ధులు నెలకొనాలని పడాల శ్రీను, కావ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రామ్నగర్ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని సీతారాముల వారి ఆశీస్సులు పొందారు.