రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు సంస్థ అధికార ప్రతినిధి కె. రాము తెలిపారు.
కింగ్ జార్జ్ ఆసుపత్రి, ఆంధ్ర మెడికల్ కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, వైద్య విజ్ఞాన సంస్థ విశాఖపట్నం సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ రోగుల సేవలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య ఆరోగ్య రంగంలో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు సేవలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు: * పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి * వేతనాల ఆలస్యం జరిగినప్పుడు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (HDS), కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ (CDS) ద్వారా ప్రత్యామ్నాయ ఆర్థిక ఏర్పాట్లు చేయాలి * ప్రతి నెలా జీతాలు క్రమం తప్పకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి * జీతాల బకాయిలపై ప్రత్యేక సమీక్ష వ్యవస్థ ఏర్పాటు చేయాలి * కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన భద్రతను కాపాడాలి ఈ వినతిపత్రం ప్రతులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కమిషనర్, వైద్య విద్యా డైరెక్టర్, ప్రజారోగ్య డైరెక్టర్లకు కూడా పంపినట్లు తెలిపారు.
కె. రాముఅధికార ప్రతినిధి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ దేశం కోసం – సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ సంప్రదించవలసిన నంబర్: 9949319239.