ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల రెండు భుజాల్లో తీవ్ర రోటేటర్ కఫ్ గాయాలు, కుడి భుజంలో ఎముకకు సంబంధించిన గాయం (అవల్షన్ ఫ్రాక్చర్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించినప్పటికీ, ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఆయన చికిత్సకు అంగీకరించారు.
ఈ నెల 11న ప్రముఖ ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పర్దివాలా నేతృత్వంలోని వైద్య బృందం కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే కోలుకోవడం కష్టమవుతుందని భావించి, ప్రస్తుతం కుడి భుజానికే శస్త్రచికిత్స చేశారు. ఎడమ భుజానికి అవసరాన్ని బట్టి తర్వాతి దశలో చికిత్స లేదా శస్త్రచికిత్స చేపట్టనున్నారు.
శస్త్రచికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సూచన మేరకు కొద్ది వారాలు విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకోనున్నారు. అనంతరం క్రమంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఏ. శ్రీనివాస రావు,
క్రైమ్ ఎనాలిసిస్,
జిల్లా ఇన్చార్జి,
అనకాపల్లి.