క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ పర్యటించారు. ఈ సందర్భంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన బోటు షికారులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రకృతి సౌందర్యాలకు నిలయమైన కొండకర్ల ఆవను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. బోటింగ్ సౌకర్యం కల్పించడం ద్వారా పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చని పేర్కొన్నారు.పర్యాటక రంగ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. కొండకర్ల ఆవ పరిసర ప్రాంతాల్లో మరిన్ని పర్యాటక సదుపాయాల ఏర్పాటుకు వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.