లోక కల్యాణార్థం ఘనంగా జ్యేష్ట పౌర్ణమి యజ్ఞం:

లోక కల్యాణార్థం ఘనంగా జ్యేష్ట పౌర్ణమి యజ్ఞం:

31/May/2026 19:05    Share:   

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
 
కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ 

యలమంచిలి/కొత్తూరు: లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు గ్రామంలో జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో వెలసియున్న శ్రీ గుమ్మడి అమ్మలు అమ్మవారి ఆలయంలో దేశ, రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక యజ్ఞ క్రతువును అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ విశేష హోమ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో పాటు సుందరపు సతీష్ కుమార్ మరియు సుందరపు రవి కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు శాస్త్రోక్తంగా సాగిన ఈ యజ్ఞంలో వారు ఆలయ పీఠం వద్ద కూర్చుని విశేష ఆహుతులను సమర్పించారు.
ఈ పవిత్ర క్రతువు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య దిగ్విజయంగా సాగింది. స్థానిక వేద పాఠశాల కార్యదర్శి పెద్దింటి. సూర్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో, పాఠశాల అధ్యాపకులు కులకర్ణి, ఆకొండి సాయి, రాచకొండ శ్రీనివాస శర్మ, భాగవతుల సాయి శర్మ మరియు వేద పాఠశాల విద్యార్థులు ఈ యజ్ఞంలో పాల్గొని మంత్రపాఠాలను పఠించారు. జ్యేష్ట పౌర్ణమి వంటి విశిష్ట దినాన ప్రజల క్షేమాన్ని కోరుతూ ప్రజాప్రతినిధులు, వేద పండితులు కలిసి ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడంపై స్థానిక భక్తులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.
Breaking News

Subscribe our Newsletter