ఏలూరు జిల్లాలో మహానాడు గ్రాండ్ సక్సెస్... టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి...
29/May/2026 21:31
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు -
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా జయప్రదం చేశారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు అందరికీ మరిచిపోని గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. అలాగే ఈ పసుపు పండుగకు జిల్లాలో అత్యధిక శాతం మంది టిడిపి కుటుంబ సభ్యులు హాజరుకావడంతో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం దక్కించుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏలూరు పవర్ పేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సారి మహానాడును క్లస్టర్ స్థాయిలో కూడా నిర్వహించడంతో ప్రతిఒక్కరూ దీనిలో పాల్గొనే సువర్ణావకాశం దక్కిందన్నారు. రెండు రోజుల పాటూ జరిగిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని, మహానాడు వేడుకలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని జిల్లా సారధి బడేటి చంటి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పనిచేసి కూటమికి మరో అద్భుత విజయాన్ని అందించాలని ఆయన కోరారు. తొలిసారిగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ మహానాడుకు హాజరై రానున్న ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమని బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు మహిళలదేనని వారు అన్ని రంగాల్లో మరింతగా రాణించే విధంగా కూటమి ప్రభుత్వం అండదండలు అందిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పలువురు క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇన్చార్జులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....