అనకాపల్లి జిల్లా, మే 9 (క్రైo న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలో మంచినీటి కుళాయిలు, పైపులు సరిగా మరమ్మతులు చేయకపోవడంతో విలువైన తాగునీరు కాలువల్లోకి వృథాగా పారిపోతోంది. పైపులు పగిలిపోవడం, టాప్లు సరిగా లేకపోవడం వల్ల ప్రజలకు సరైన నీటి సరఫరా అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు కూడా అందించలేకపోతే గ్రామపంచాయతీ వ్యవస్థ ఉన్న ప్రయోజనం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నాయకులు, పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు మంచినీరు వృథా అవుతుండటం ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకుండా వెంటనే దెబ్బతిన్న పైపులు, కుళాయిలను మరమ్మతు చేసి ప్రతి ఇంటికీ సక్రమంగా మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు నాయకులను, గ్రామపంచాయతీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేక ప్రజల కష్టాలు ఇలాగే కొనసాగుతాయా? అనే ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి.?