అనకాపల్లి:
మే ఒకటో తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా అనకాపల్లిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అత్యంత సామాన్య జీవితాన్ని గడిపిన మహనీయుడు, సిపిఐ (CPI) దిగ్గజ నేత కొడుగంటి గోవిందరావు గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆదర్శప్రాయుడు గోవిందరావు:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు మాట్లాడుతూ.. కొడుగంటి గోవిందరావు గారు రాజకీయాల్లో నైతిక విలువలకు నిలువుటద్దమని కొనియాడారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిగా జీవించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు. నేటి తరానికి ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్మికుల హక్కుల కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన గోవిందరావు గారి అడుగుజాడల్లో తాము నడుస్తామని ఈ సందర్భంగా ఆప్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.