
అనకాపల్లి జిల్లాలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ పై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరీక్షల లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షల్లో తరచుగా లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గత 11 సంవత్సరాలలో 89 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని, ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లలో పేపర్లు ముద్రించడం వల్ల అవి బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు.
నీట్ కోచింగ్ సెంటర్లు విద్యార్థుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి, పేపర్లను ముందుగానే అమ్ముకుంటున్నాయని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య వ్యాపారంగా మారిపోయిందని, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కోటా వంటి ప్రాంతాల్లో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని తెలిపారు.
గతంలో రాష్ట్రాలు స్వయంగా పరీక్షలు నిర్వహించి మెడికల్ సీట్లు భర్తీ చేసేవి, కానీ ఇప్పుడు కేంద్రం అన్ని పరీక్షలను తన ఆధీనంలోకి తీసుకొని కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు.
ఈ విధానం వల్ల మన రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని, 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని,
కార్పొరేట్ విద్యాసంస్థలు సంవత్సరాల తరబడి ఫీజులు వసూలు చేసి విద్యార్థులను నిరాశకు గురి చేశాయని అన్నారు.
పేపర్ లీకేజీకి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు డి. దివాకర్, పి. చలపతి, పి. పాపారావు, భవ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.