వార్త ప్రభావం..ఏటికొప్పాకలో నీటి సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు...
11/May/2026 18:12
Share:
అనకాపల్లి జిల్లా మే 11 ( క్రైం న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ):
ఏటికొప్పాక గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలపై ప్రసారమైన వార్తకు అధికారులు వెంటనే స్పందించి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాకలో నీటి కొరత, డ్యామేజ్ పైపులు, లీకేజీలు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామ నాయకులు కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పైపుల మరమ్మతులు, లీకేజీల నివారణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎక్కడ నీటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చూపిస్తామని అధికారులు తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు మంచినీటిని వృథా చేయకుండా సంరక్షించాలని, అక్రమ కనెక్షన్లు కలపకూడదని సూచించారు. ఎక్కడైనా పైపుల డ్యామేజ్లు, లీకేజీలు కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు.వార్తకు స్పందించి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న అధికారులను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు..