అనకాపల్లి: ఇకపై రోడ్లపై ట్రాఫిక్ పోలీసులే కాదు, ఆకాశం నుండి డ్రోన్ కెమెరాలు కూడా మీ వాహన కదలికలను గమనిస్తుంటాయి. నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు చెక్ పెట్టేందుకు అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా డ్రోన్ టెక్నాలజీని రంగంలోకి దించారు
శుక్రవారం ట్రాఫిక్ సిఐ ఎం.వెంకటనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మరియు ఇతర ఉల్లంఘనలపై పోలీసులు ఫోకస్ పెట్టారు
డ్రోన్ కెమెరాలకు చిక్కిన ఉల్లంఘనలు:
ఈ తనిఖీల్లో మొదటిసారిగా డ్రోన్లను ఉపయోగించడం విశేషం. రహదారులపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారు, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారు, మరియు అతివేగంగా (రాష్ డ్రైవింగ్) వెళ్లే వారిని డ్రోన్ విజువల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిబంధనలు పాటించని ప్రతి ఒక్క వాహనదారుడికి రూ. 1,035/- జరిమానా విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఎం.వెంకటనారాయణ మాట్లాడుతూ.. "ఇకపై అనకాపల్లి జిల్లాలో ట్రాఫిక్ నిఘా కేవలం రోడ్లపైనే కాకుండా, ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా కూడా ఉంటుంది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు శేఖరం, శేషగిరి, సత్యనారాయణ, అర్జునరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు