కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చేనిన 820 బస్సులను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలకు అనుగుణముగా లేని బస్సుల యాజమాన్యాలకు నోటీసులు అందించినట్లు ఉప రవాణా కమీషనర్ షేక్ కరీమ్ తెలిపారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వ్యాప్తముగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 తనిఖీ బృందాలను ఏర్పాటు అన్ని ప్రైవేటు విద్యాసంస్థల పాఠశాలలు, కళాశాలల బస్సుల ప్రత్యేక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో భాగముగా జిల్లాలో ఈనెల ఒకటవ తేదీ నుంచి ది. 22.05.2026 నాటికి 110 ప్రైవేటు విద్యాసంస్థ లలోని 820 బస్సులను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలకు అనుగుణముగా లేని బస్సులకు సంభందించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు అందించామన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వారి బస్సులలోని లోపాలను సరిచేసుకుని, బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ ను ది. 25.05.2026 లోపు పొందాలని, లేనియడల కేసులు నమోదు చేయడముతో పాటూ బస్సులను సీజ్ చేయడము జరుగుతుందని కరీమ్ హెచ్చరించారు.
ప్రతీ రవాణా వాహనానికి వాహన లొకేషన్ ట్రాకింగ్ డివైస్ (వి.ఎల్.టి.డి.)ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్,1వ తేదీ నుండి తప్పనిసరి చేసిన నేపథ్యములో కచ్చితంగా ప్రతీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో వి.ఎల్.టి.డి. లను అమర్చాలని డీటీసీ అన్నారు.
అదేవిధంగా, ప్రమాదరహిత డ్రైవింగ్ పద్ధతులు, ట్రాఫిక్ నిబంధనలు, విద్యార్థుల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాహన తనిఖీ అధికారులు రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేటు విద్యాసంస్థల పాఠశాలలు, కళాశాలల బస్సుల్లో ఈ దిగువ భద్రతా ప్రమాణాలను ఖచ్చితముగా పాటించాలన్నారు.
1. అన్ని విద్యాసంస్థల బస్సులు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ మరియు అనుమతులు కలిగి ఉండాలి.
2. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అనుభవం కలిగి ఉండాలి.
3. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరియు అత్యవసర నంబర్లు అందుబాటులో ఉండాలి.
4. బస్సులో విద్యార్థుల సంఖ్య నిర్ణీత సామర్థ్యాన్ని మించకూడదు.
5. ప్రతి బస్సులో ఒక అటెండర్ను నియమించాలి, ముఖ్యంగా చిన్న పిల్లల భద్రత కోసం.
6. బస్సులు సమయానికి తనిఖీ చేయబడుతూ, సాంకేతికంగా సురక్షితంగా ఉండాలి.
7. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు మరియు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలి.
8. విద్యార్థుల ఎక్కింపు, దిగింపు సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
9. ప్రతి బస్సులో ఎమర్జెన్సీ ద్వారం తప్పకుండ ఉండాలని షేక్ కరీమ్ తెలియజేసారు.