నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్లో స్వైన్ఫ్లూ (Swine Flu) వ్యాప్తి తీవ్రతరమవుతోంది. నగరంలో రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC) వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవలం జూలై నెలలోనే నగరంలో మొత్తం 15 స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యారియంట్ బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు మున్సిపల్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో వైరల్ ఇన్ఫెక్షన్లు, స్వైన్ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.