అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం,
ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని దార్లపూడి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామివారి దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ప్రతిరోజూ అనకాపల్లి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వివాహాలకు ప్రసిద్ధి – శుభఫలితాలు
ఈ ఆలయంలో వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుందని, శుభఫలితాలు కలుగుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసంతోనే వివిధ ప్రాంతాల నుంచి వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ఇక్కడ వివాహాలు జరుపుకుంటున్నారు. స్వామివారి అనుగ్రహంతో తమ కోరికలు నెరవేరాయని, జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకున్నాయని పలువురు భక్తులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
నిత్య అన్నసమారాధన, విశేష పూజలు
ఆలయంలో ప్రతిరోజూ హోమాలు, ప్రత్యేక పూజలు, అన్నసమారాధనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ నిత్య పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని ఆలయ అర్చకులు రేజేటి పవన్ కుమారాచార్యులు తెలిపారు. రోజురోజుకూ ఈ ఆలయ ఖ్యాతి పెరుగుతుండడంతో భక్తుల రద్దీ కూడా నిరంతరం అధికమవుతోందని ఆయన పేర్కొన్నారు.
(క్రైమ్ఎనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):