ఏలూరు పెదవేగి ఆయిల్ ఫెడ్ నూతన కర్మాగారం నిర్మించాలి.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

ఏలూరు పెదవేగి ఆయిల్ ఫెడ్ నూతన కర్మాగారం నిర్మించాలి.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

26/June/2026 18:59    Share:   

ఓ.ఈ.ఆర్ పేరుతో కంపెనీలు ఆయిల్ పామ్ రైతులను దోపిడీ చేయడాన్ని అరికట్టాలి.
ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలి. 
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్.. 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
పెదవేగిలో నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓ.ఈ.ఆర్ పేరుతో ఆయిల్ పామ్ రైతులను కంపెనీలు దోపిడీ చేసే చర్యలను అరికట్టాలని,ఆయిల్ పామ్ రైతులకు అధిక దిగుబడులు నిచ్చే మొక్కలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఏలూరులోని ఉద్దరాజు రామం భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.5% ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేటు (ఓ.ఈ.ఆర్) కు వ్యతిరేకంగా కోర్టులో ఆయిల్ పామ్ కంపెనీలు కేసు వేసి 17.5%కు తగ్గించాలన కోరడం దుర్మార్గమని విమర్శించారు. ఆయిల్ పామ్ కంపెనీలు ఏకమై రైతులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం తగదన్నారు. ఈ విషయంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. కంపెనీలు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కంపెనీలకు వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా ప్రభుత్వాలే కోర్టుకు వెళ్లాలని, రైతులు ఇంప్లీడ్ అయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాలన్నారు. ఓ.ఈ.ఆర్ సమస్య పరిష్కారం కావాలంటే నూతన టెక్నాలజీతో పెదవేగిలో ఆయిల్ ఫెడ్ నూతన కర్మాగారాన్ని నిర్మించాలని అందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కర్మాగారం నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. పాత మిషనరీతో కూడిన పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం లాభాలలో ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మివేయాలని ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్నాగారం ప్రైవేటీకరణను రైతులు ఐక్యంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జులై 3న ఏలూరులో జరుగుతున్న హాలో రైతన్న - చలో ఏలూరు కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు ఆర్.లింగరాజు,పి. రామకృష్ణ,పంపన రవికుమార్, ఎం.ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter