అనకాపల్లి (అచ్యుతాపురం), ఫిబ్రవరి 17:
పరిశ్రమల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి రక్షణే జిల్లా పోలీసు యంత్రాంగం తొలి ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అచ్యుతాపురం బ్రాండిక్స్ (Brandix) కంపెనీ లోని యూనిట్ 2 లో మహిళా ఉద్యోగులకు చట్టాలు, రక్షణ, మార్గాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ ఎస్సై పి.రాములమ్మ పాల్గొని కీలక సూచనలు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కవచంలా పనిచేసే 'శక్తి' యాప్ను ప్రతి మహిళా ఉద్యోగి మొబైల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఒక్క బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసు సహాయం అందుతుందని వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, ఫోటోలు షేర్ చేయవద్దని హెచ్చరించారు.
వేధింపులకు గురయ్యే మహిళలకు భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 181 ద్వారా ఉచిత న్యాయ, వైద్య మరియు కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్సై రాములమ్మ తెలిపారు.
పని ప్రదేశాల్లో లేదా బయట వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

"మీ భద్రతే మా బాధ్యత. వేధింపులను మౌనంగా భరించవద్దు, ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి." - జిల్లా పోలీస్ యంత్రాంగం అనంతరం మహిళా ఉద్యోగులు అడిగిన పలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.